వైజాగ్ లోకల్ న్యూస్ - జాతీయం / విశాఖపట్నం : భారత ఆటోమొబైల్ మార్కెట్లో దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక రిటైల్ అమ్మకాలను నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఇదే సమయంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా, హ్యుందాయ్, కియా వంటి విదేశీ సంస్థలు అమ్మకాల్లో వెనుకబడ్డాయి. వాహన్ పోర్టల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ నెలలో టాటా మోటార్స్ ఏకంగా 40,594 కార్లను విక్రయించింది. ఒక్క నెక్సాన్ మోడల్ కార్లే 22,500 యూనిట్లకు పైగా అమ్ముడవడంతో, కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధిక రిటైల్ అమ్మకాల రికార్డుగా నిలిచింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో 11.52 శాతంగా ఉన్న టాటా మార్కెట్ వాటా, ఈసారి 13.75 శాతానికి పెరిగింది.
మరోవైపు, ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. సెప్టెంబర్లో 1,23,242 వాహనాలను విక్రయించి 41.17 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు, మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగాయి. మూడో స్థానంలో మహీంద్రా & మహీంద్రా నిలిచింది. థార్, స్కార్పియో మోడళ్ల ఆదరణతో ఆ సంస్థ 37,659 వాహనాలను విక్రయించి 12.58 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు మాత్రం నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే నెలలో 38,833 కార్లను అమ్మిన హ్యుందాయ్, ఈసారి 35,812 యూనిట్లకే పరిమితమైంది. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 13.72 శాతం నుంచి 11.96 శాతానికి పడిపోయింది. దాని అనుబంధ సంస్థ కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా మార్కెట్ వాటాను స్వల్పంగా కోల్పోయాయి. మొత్తం మీద, సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 2,99,369 యూనిట్లుగా నమోదయ్యాయి.
Vizag Local NewsAdmin